ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడిగా బైట్డాన్స్ సహ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ నిలిచారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జాంగ్ యిమింగ్ నికర సంపద 92.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఆయన చైనాలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు. 2019లో బ్లూమ్బర్గ్ ఆయన సంపదను ట్రాక్ చేయడం ప్రారంభించినప్పుడు అది కేవలం 13 బిలియన్ డాలర్ల వద్ద ఉండగా, ప్రస్తుతం ఏడు రెట్లకు పైగా పెరగడం విశేషం. ఈ వృద్ధికి ప్రధాన కారణం టిక్టాక్ ప్రపంచవ్యాప్త విజయంతో పాటు బైట్డాన్స్ అభివృద్ధి చేసిన డౌబావో ఏఐ చాట్బాట్కు చైనాలో లభిస్తున్న ఆదరణ. డౌబావోకు ఇప్పటికే 300 మిలియన్లకు పైగా నెలవారీ యాక్టివ్ వినియోగదారులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో బైట్డాన్స్ దూకుడుగా పెట్టుబడులు పెడుతుండటం కూడా కంపెనీ విలువను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. అమెరికాలో టిక్టాక్ కార్యకలాపాలపై గత కొన్నేళ్లుగా నెలకొన్న నియంత్రణ అనిశ్చితి కూడా ఇటీవల కొంతవరకు తగ్గింది. బైట్డాన్స్ తన అమెరికా వ్యాపారంలోని భాగాలను అమెరికన్ పెట్టుబడిదారులకు బదిలీ చేయడంతో కంపెనీపై ఉన్న రిస్క్ డిస్కౌంట్ను బ్లూమ్బర్గ్ తగ్గించింది. దీంతో సంస్థ విలువపై మరింత సానుకూల అంచనాలు వెలువడ్డాయి. ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ సంస్థలు బ్లాక్రాక్, ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్, టి.రోవీ ప్రైజ్, జనరల్ అట్లాంటిక్, తదితర సంస్థల తాజా విలువల అంచనాల ఆధారంగా జాంగ్ సంపద ఒక్కసారిగా 24 బిలియన్ డాలర్లకు పైగా పెరిగినట్లు సమాచారం. భారతీయ బిలియనీర్లలో ముకేశ్ అంబానీ 86.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఆసియాలో మూడో స్థానానికి దిగజారగా, గౌతమ్ అదానీ 117.4 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. సోషల్ మీడియా కంపెనీగా ప్రారంభమైన బైట్డాన్స్ ఇప్పుడు ఏఐ రంగంలోనూ భారీ ఆశయాలతో ముందుకు సాగుతోంది. 2026లో ఏఐ మౌలిక సదుపాయాలు, చిప్స్, మోడల్ అభివృద్ధిపై భారీ పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. టిక్టాక్ విజయాన్ని ఏఐ వ్యాపారంలోనూ పునరావృతం చేయగలిగితే, జాంగ్ యిమింగ్ సంపద మరింత వేగంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
0 Comments