Ad Code

మేడిగడ్డ, కాళేశ్వరం మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులు నవంబర్-డిసెంబర్‌లో ప్రారంభం !

మేడిగడ్డ బ్యారేజీతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను అత్యంత శాస్త్రీయ పద్ధతిలో చేపట్టి 2027 వేసవి నాటికి పూర్తిచేసి తిరిగి వినియోగంలోకి తీసుకువస్తామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరుగుతున్న సాంకేతిక పరిశోధనలు, హైడ్రాలజికల్ అధ్యయనాలు, జియోటెక్నికల్ పరీక్షలు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) సర్వేలు, పునరుద్ధరణ ప్రణాళికల పురోగతిని బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జూలై తొలి వారానికి అన్ని సాంకేతిక, హైడ్రాలజికల్ అధ్యయనాలు పూర్తవుతాయని, అనంతరం సేకరించిన నివేదికలను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎసఏ)లకు పంపుతామని తెలిపారు. వాటి సూచనల మేరకు 2026 సెప్టెంబర్ నాటికి పునరుద్ధరణ డిజైన్లను ఖరారు చేస్తామనిరు. వర్షాకాలం ముగిసిన వెంటనే 2026 నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ తొలి వారంలో పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని, ఒకే పని సీజన్‌లో పనులు పూర్తి చేసి 2027 వేసవి నాటికి బ్యారేజీలను తిరిగి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి స్పష్టం చేశారు. హైడ్రాలజికల్ అధ్యయనాలతోపాటు జియోటెక్నికల్ బోర్‌హోల్ పరిశోధనలు, ఇతర సాంకేతిక పరీక్షలను వేగవంతం చేశామని తెలిపారు. ప్రస్తుతం మూడు బ్యారేజీల్లో జీపీఆర్ పరీక్షలు 90 శాతం పూర్తయ్యాయని, బోర్‌హోల్, జియోటెక్నికల్ పరిశోధనలు 80 శాతం వరకు పూర్తయ్యాయని చెప్పారు. జూన్ చివరి నాటికి అన్ని పరీక్షలు, పరిశోధనలు పూర్తవుతాయని వెల్లడించారు. భవిష్యత్తులో ఈ తరహా నష్టం పునరావృతం కాకుండా ఉండేందుకు 40 నుంచి 80 మీటర్ల లోతు వరకు బోర్‌హోల్స్ తవ్వి భూగర్భ పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. కేంద్ర జల సంఘం, జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థల ఆమోదం వచ్చిన తర్వాతే పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలు, ప్రాజెక్టుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు

Post a Comment

0 Comments

Close Menu