Ad Code

ప్రాణం తీసిన ప్రేమ వివాహం : యువకుడిని హత్య చేసిన భార్య సోదరుడు, బంధువులు

హైదరాబాద్‌లోని గోల్కొండ ప్రాంతంలో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని భార్య సోదరుడు మరియు బంధువులు కలిసి క్రూరంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది . ఈ కేసులో నలుగురు ప్రధాన నిందితులను గోల్కొండ పోలీసులు అరెస్టు చేసి, వారిని కోర్టుకు హాజరుపరిచి రిమాండ్‌కు పంపించారు. ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేక పగ తీర్చుకునేందుకు ఈ హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోల్కొండ ప్రాంతంలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న మహబూబ్ అనే యువకుడు 2025 జనవరి నెలలో రుక్సర్ బేగం అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వివాహాన్ని రుక్సర్ సోదరుడు షేక్ సోహైల్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో మహబూబ్‌పై తీవ్ర ద్వేషం పెంచుకున్న సోహైల్ తన బంధువులతో కలిసి అతనిపై వివిధ సందర్భాల్లో దాడులు చేస్తూ వచ్చాడు. కొన్ని రోజుల ముందు కూడా తన తల్లి, సోదరితో కలిసి మహబూబ్ ఇంటికి వెళ్లి గొడవ చేసి, సోదరిని తీసుకు వెళ్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జూన్ 12న మధ్యాహ్నం సోహైల్ తన బంధువులైన జీషన్ నవాబ్, అమీర్ నవాబ్, నఫీజ్ సుల్తానాలతో కలిసి ఇనుప రాడ్లు, కత్తులు, కర్రలు వంటి ఆయుధాలతో మహబూబ్ ఇంట్లోకి చొరబడి అతనిపై దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహబూబ్ సంఘటనా స్థలం లోనే ప్రాణాలు విడిచాడు. హత్య సమయంలో తన కొడుకును కాపాడటానికి వచ్చిన మహబూబ్ తండ్రిపై కూడా నిందితులు దాడి చేశారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. టోలిచౌకి ఏసీపీ సయ్యద్ ఫయాజ్ పర్యవేక్షణలో నలుగురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టు సమక్షంలో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. 

Post a Comment

0 Comments

Close Menu