Ad Code

నీటి కుంటలో నలుగురు బాలురు గల్లంతు : రెండు మృతదేహాలు లభ్యం


ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువు కొమ్ముపాలెం గ్రామానికి చెందిన నలుగురు బాలురు గ్రామ సమీపంలో ఉన్న ఒక నీటి కుంటలో ఈత కొట్టడానికి వెళ్లారు. నీటి లోతును గమనించకపోవడంతో ఆ నలుగురు బాలురు ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగిపోయి గల్లంతయ్యారు. చిన్నారులు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. నీటి కుంట ఒడ్డున చిన్నారుల దుస్తులు, చెప్పులు ఉండటాన్ని గమనించిన స్థానికులు, వారు ఈతకు దిగి లోపల చిక్కుకుపోయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా కరేటి అభిరామ్ (14), కరేటి సుశాంత్ (12) అనే ఇద్దరు బాలురు మృతదేహాలు లభ్యమయ్యాయి.  గల్లంతైన మరో ఇద్దరు చిన్నారులు చిన్ను, దినేష్‌ల ఆచూకీ కోసం పోలీసులు, సహాయక సిబ్బంది, గజ ఈతగాళ్లు నీటి కుంటలో గాలింపు చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కళ్లముందే ఆడుకుంటూ వెళ్లిన పిల్లలు నిగర్వంగా ప్రాణాలు కోల్పోవడం, మరికొందరి ఆచూకీ దొరకకపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా తల్లడిల్లిపోతున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ దారుణ ఘటనపై రాష్ట్ర మంత్రి డీఎస్‌బీవీ స్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వెంటనే ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటి కుంటలో గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని, మిగిలిన చిన్నారులను వెలికితీసేందుకు అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

Post a Comment

0 Comments

Close Menu