పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్, బన్నూ జిల్లాలోని మార్కాబేరా ప్రాంతంలో చోటుచేసుకున్న వరుస పేలుళ్లులో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మొదటి పేలుడు ప్రయాణికులతో వెళ్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకోగా, రెండో పేలుడు సహాయక చర్యల కోసం అక్కడికి చేరుకున్న వారిని లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు పోలీసులు తెలిపారు. బన్నూ జిల్లా పోలీస్ అధికారి యాసిర్ అఫ్రిది వెల్లడించిన వివరాల ప్రకారం, హతి ఖేల్ గ్రామం నుంచి బన్నూ నగరానికి వెళ్తున్న ఓ ప్యాసింజర్ వ్యాన్ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు పక్కన అమర్చిన ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైస్ పేలింది. ఈ పేలుడు ధాటికి వ్యాన్ తీవ్రంగా దెబ్బతిని, ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మొదటి పేలుడు అనంతరం స్థానికులు, సహాయక బృందాలు బాధితులను రక్షించేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే కొద్దిసేపటికే అదే ప్రాంతంలో మరో పేలుడు సంభవించింది. ఈ రెండో విస్ఫోటనంలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఒక వాహనం ధ్వంసమైంది. మొత్తం రెండు పేలుళ్లలో ఏడుగురు మరణించగా, ముగ్గురు గాయపడినట్లు అధికారులు ధృవీకరించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. ఘటన అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ దాడులకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు.
0 Comments