ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో ఒక ప్రైవేట్ వసతి గృహంలో డిగ్రీ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు, తోటి విద్యార్థుల కథనం ప్రకారం అనంతపురం జిల్లా నార్పల మండలానికి చెందిన నందిని (19) అనే విద్యార్థిని నగరంలోని ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చదువు నిమిత్తం ఆమె నగరంలోని ఒక ప్రైవేట్ వసతి గృహంలో ఉంటోంది. అయితే, మంగళవారం ఉదయం హాస్టల్ భవనం ఆవరణలో నందిని అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉండటాన్ని తోటి విద్యార్థినులు గమనించారు. వారు వెంటనే ఈ విషయాన్ని వసతి గృహ యాజమాన్యానికి తెలియజేయగా.. యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న వెంటనే అనంతపురం టూ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పడి ఉన్న తీరును, హాస్టల్ గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఆమె మృతి వెనుక మరేదైనా బలమైన కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తోటి విద్యార్థినులను, హాస్టల్ సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తాయని అధికారులు వెల్లడించారు.
0 Comments