పంజాబ్ లోని జలంధర్ ప్రభుత్వ ఆసుపత్రిలో లేడీ డాక్టర్గా పనిచేస్తున్న మీనాక్షి సూద్ తన గదిలో ఉరివేసుకున్నారు. ఆమె భర్త పియూష్ సూద్, అక్కడ ఉన్న ఒక ప్రైవేట్ కంటి ఆసుపత్రిలో కంటి వైద్యుడిగా పనిచేస్తున్నాడు. గత కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య తీవ్ర కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై మీనాక్షి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పియూష్ సూద్ పనిచేసే ఆసుపత్రిలోని ఒక నర్సుతో అతడికి అక్రమ సంబంధం ఉందని ఆరోపించారు. దీనిని మీనాక్షి నేరుగా నిలదీయడంతో, భర్త ఆమెను నిరంతరం దారుణంగా కొడుతూ, తీవ్ర మానసిక, శారీరక వేధింపులకు గురిచేసేవాడని తెలిపారు. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను మీనాక్షి పరిశీలించినప్పుడు, తన భర్త సదరు నర్సుతో ఏకాంతంగా ఉన్న షాకింగ్ ఆధారాలు దొరికాయి. ఆ సీసీటీవీ దృశ్యాలను ప్రస్తుతం పోలీసులకు అందజేశారు. భర్త వేధింపులు తట్టుకోలేక గత 2025 జూలై నుండి మీనాక్షి ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలోఆమె తనకోసం ఒక కొత్త ఇల్లు కొనడానికి బ్యాంకుకు వెళ్లినప్పుడు మరో ఘోరమైన నిజం తెలిసింది. మీనాక్షి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆమె పేరిట భర్త పియూష్ దాదాపు రూ. 2.5 కోట్ల భారీ మొత్తాన్ని బ్యాంకు నుండి లోన్గా తీసుకున్నట్లు బయటపడింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మీనాక్షి విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో ప్రస్తుతం అనుమానాస్పద స్థితిలో శవమై తేలింది. ఇది ఆత్మహత్యా లేక ప్రణాళికాబద్ధమైన హత్య అనే కోణంలో శవపరీక్ష నివేదిక ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న పియూష్ను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ మృతురాలి తల్లిదండ్రులు ఆందోళన జరుపుతున్నారు.
0 Comments