హైదరాబాద్ లోని పాతబస్తీ గోల్డ్మ్యాన్గా పేరుపొందిన పల్లపు సురేశ్కుమార్ అలియాస్ సూర్యాభాయ్ అనే వ్యక్తిపై నారాయణగూడ పీఎస్లో కేసు నమోదైంది. తక్కువ ధరకే విదేశీ గోల్డ్ను ఇప్పిస్తానంటూ పలువురి వద్ద రూ.30 లక్షలు తీసుకుని మోసం చేసినట్టు ఆరోపణలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు సన్నిహితుడినంటూ తమను సూర్యాభాయ్ నమ్మబలికాడని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బంగారం ఇవ్వక, డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో అతడి ఇంటికి వెళ్లి నిలదీయడంతో 3 ఐఫోన్లు, రూ.20లక్షల చెక్ ఇచ్చి పంపించారని బాధితులు చెప్పారు. ఆ తర్వాత తమను బెదిరించి ఫోన్లు తీసుకెళ్లారని అత్తాపూర్ పోలీసులకు వివరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు కేసును నారాయణగూడ ఠాణాకు బదిలీ చేశారు. నిత్యం ఒంటిపై 3 కేజీల బంగారు ఆభరణాలతో తిరుగుతూ, యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ, సీరియళ్లలో నటించే సూర్యాభాయ్ అసలు రంగును ఆదాయపు పన్నుశాఖ అధికారులు బయటపెట్టారు. మరో గోల్డ్మ్యాన్ ఇచ్చిన సమాచారంతో ఐటీ అధికారులు సూర్యాభాయ్ని విచారించగా, అతడి ఒంటిపై ఉన్నవి పసిడి నగలు కావని, కేవలం రూ.3 లక్షల విలువైన బంగారు పైపూత ఆభరణాలని తేలింది. కేవలం పాపులారిటీ కోసమే అతడు ఈ గోల్డ్మ్యాన్ అవతారం ఎత్తినట్లు అధికారులు స్పష్టం చేశారు.
0 Comments