Ad Code

జూబ్లీహిల్స్‌లో బాలికలకు వల కేసు : మీనాకుమారి పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు


హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నమోదైన 'బాలికలకు వల' కేసులో నిందితురాలు మీనాకుమారి మేజిస్ట్రేట్ ఎదుట ఒకలా, ఇక్కడి పిటిషన్‌లో మరోలా విరుద్ధ ప్రకటనలు చేయడం సరికాదని హైకోర్టు హెచ్చరించింది. రిమాండ్‌ సమయంలో ఎలాంటి వేధింపులు జరగలేదని చెప్పిన ఆమె, అనంతరం తనను వేధింపులకు గురిచేశారని చెప్పడాన్ని తప్పుబట్టింది. ఆమె కోరిన విధంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటుగానీ, సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలని ఆదేశించలేమని తేల్చిచెప్పింది. పిటిషన్‌లో కోరిన ఉపశమనాల మంజూరుకు ఎలాంటి కారణాలు కనిపించలేదంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా మైనర్‌ బాలికలను వలలో వేసుకుని, వారితో లైంగిక వాంఛ తీర్చుకోవడంతో పాటు లక్షలో డబ్బు దోచుకున్నారన్న ఆరోపణలపై చంద్రశేఖర్‌ ఆజాద్‌ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తర్వాత అతని తల్లి మీనాకుమారితో పాటు మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తను పోలీసులు తీవ్ర వేధింపులకు గురిచేశారని, సిట్‌ , సీఐడీ విచారణకు ఆదేశించాలని కోరుతూ నిందితురాలు మీనాకుమారి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేసి పిటిషనర్‌ను అక్రమంగా నిర్బంధించారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట నిబంధనలను ఉల్లంఘించారన్నారు. ఈ ఘటనపై సిట్‌ ఏర్పాటుతో పాటు రూ.50 లక్షల పరిహారం మంజూరు చేయాలని, సంబంధిత పోలీసు స్టేషన్ల సీసీటీవీ ఫుటేజీ, ఫోన్‌ కాల్‌ డేటా, సెల్‌ టవర్‌ లొకేషన్‌ వివరాలను భద్రపరచాలని కోరారు. హోం జీపీ మహేశ్‌ రాజే వాదనలు వినిపిస్తూ మే 5న రిమాండ్‌ సమయంలో మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరైన పిటిషనర్, పోలీసులు తనను ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని పేర్కొన్నారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్‌ చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవని, కోర్టు ముందు ఉన్న రికార్డులు ఆమె వాదనలకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Post a Comment

0 Comments

Close Menu