Ad Code

పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ లోని కెమికల్ ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాద దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి ప్రమాద తీవ్రత, మంటలను అదుపు చేసేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరవాడ పారిశ్రామికవాడలో తరచూ జరుగుతున్న ప్రమాదాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశ్రామికవాడల్లోని అన్ని రసాయన, ఫార్మా సంస్థలలో తక్షణమే సమగ్రమైన సేఫ్టీ ఆడిట్ (Comprehensive Safety Audit) నిర్వహించాలని పవన్ కల్యాణ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ప్రస్తుతం తీసుకుంటున్న భద్రతా చర్యలను ఉన్నత స్థాయిలో సమీక్షించాలన్నారు. సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులకు ఎలాంటి లోటు లేకుండా అత్యంత మెరుగైన కార్పొరేట్ వైద్య సేవలు అందించాలని జిల్లా యంత్రాంగాన్ని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు పవన్ కల్యాణ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పొట్టకూటి కోసం వచ్చి ఫ్యాక్టరీ ప్రమాదంలో బలికావడం అత్యంత హృదయవిదారకమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, వారికి తగిన న్యాయం జరిగేలా చూస్తామని ఆయన బలమైన భరోసా ఇచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu