ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గంగలకుంట గ్రామంలో కొల్లి వీరమ్మ అనే 40 ఏళ్ల మహిళను దుండగులు అతి కిరాతకంగా అంతమొందించారు. నిద్రపోతున్న సమయంలోనే ఆమెపై దాడి చేసి ప్రాణాలు తీయడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. గంగలకుంట గ్రామానికి చెందిన కొల్లి వీరమ్మ రాత్రి తన ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తోంది. ఇదే అదనుగా చూసిన గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడి గొడ్డలితో ఆమెను అతి దారుణంగా నరికి చంపారు. విషయం తెలియడంతో స్థానికులు షాక్కు గురయ్యారు. నిందితులు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారనే విషయంపై ఆరా తీస్తున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఘటన గురించి తెలుసుకున్న మాచర్ల గ్రామీణ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. వీరమ్మను ఎందుకు చంపాల్సి వచ్చిందో కారణాలు వెలికితీసే పనిలో పోలీసులు ఉన్నారు.
0 Comments