సికింద్రాబాద్ జూబ్లీహిల్స్ బస్టాప్ సమీపంలో ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి బీభత్సం సృష్టించింది. ప్రయాణికులు, వాహనదారుల మీదికి బస్సు దూసుకెళ్లడంతో అక్కడ కాసేపు తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆర్టీసీ బస్సు జేబీఎస్ నుంచి కార్ఖానా వైపు వెళ్తోంది. ఈ క్రమంలో బస్టాప్ వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఒక్కసారిగా ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఊహించని ప్రమాదంలో శివ అనే బైకర్ తన బైక్తో సహా ఆర్టీసీ బస్సు ముందు చక్రాల కింద ఇరుక్కుపోయాడు. ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే స్పందించి, బస్సు కింద ఇరుక్కుపోయిన శివను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ బస్సు బరువు ఎక్కువగా ఉండటంతో అతడిని బయటకు తీయడం సాధ్యం కాలేదు. సమాచారం అందుకున్న మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. హుటాహుటిన ఒక క్రేన్ను అక్కడికి రప్పించారు. క్రేన్ సహాయంతో బస్సును పైకి లేపి, పక్కకు జరిపిన తర్వాత బైక్తో పాటు తీవ్రంగా గాయపడిన బాధితుడు శివను సురక్షితంగా బయటకు తీశారు.
0 Comments