తెలంగాణ సచివాలయంలో విలేకర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్, మాదాపూర్ కలిపితే ఎంత ఉంటుందో అంత ఉండే విశాఖకు కూడా మెట్రో ఇచ్చారు. కానీ హైదరాబాద్ మెట్రో విస్తరణను ఆపేశారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణలో మెట్రో విస్తరణకు కేంద్రం సహకరించడం లేదనే అంశాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్ళాయి. అహ్మదాబాద్తో పాటు విశాఖ మెట్రోకు అనుమతి ఇచ్చిన కేంద్రం హైదరాబాద్కు మాత్రం వివక్ష చూపుతోందని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీరుపైనా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వైఖరిపై విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం విశాఖలో 46 కి.మీ. మెట్రో ప్రాజెక్టును ప్రతిపాదించింది. మూడు కారిడార్లలో 42 స్టేషన్లు, స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు డబుల్ డెక్కర్ మెట్రో ఆలోచనలు జరుగుతున్నాయి. ఇది విశాఖను భవిష్యత్ మెట్రోపాలిస్గా తీర్చిదిద్దడంలో కీలకమవుతుంది. హైదరాబాద్ మెట్రో విస్తరణకు అనుమతి ఆలస్యం అవుతుండటం తెలంగాణ అభివృద్ధిని ప్రభావితం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమానంగా ప్రోత్సాహం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. . తెలుగు రాష్ట్రాలు ఒకరికొకరు పోటీపడకుండా, పరస్పర సహకారంతో అభివృద్ధి సాధించాలనే ఉద్దేశం ఉన్నా, కేంద్రం మాత్రం తెలంగాణాకు సహకరించటం లేదని సీఎం అన్నారు. విశాఖ మెట్రో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, తెలంగాణాపై కేంద్రం వివక్ష చూపించటం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. విశాఖ మెట్రో పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుంది.
0 Comments