Ad Code

తెలంగాణలో జనసేనకు చోటు లేదు : పవన్ కల్యాణ్‌ను ముందు పెట్టి బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది!


హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు కేంద్రమంత్రి బండి సంజయ్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన సభకు అనుమతి నిరాకరణ, బీజేపీ రాజకీయం మరియు తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ను మేం కేవలం ఒక సినిమా యాక్టర్‌గా మాత్రమే చూస్తాం. ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయనకు గానీ, ఆయన పెట్టిన జనసేన పార్టీకి గానీ తెలంగాణతో ఏం సంబంధం?  అని మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పార్టీకి ఎలాంటి అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో పవన్ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి ఆర్థిక సాయం చేయడంపై స్పందిస్తూ.. అది కేవలం స్వామివారిపై ఉన్న భక్తితో చేసినదే తప్ప, దానికి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. తెలంగాణలో పవన్ కల్యాణ్‌ను ముందు పెట్టి బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని పీసీసీ చీఫ్ ఆరోపించారు. "పవన్ కల్యాణ్‌ను అడ్డం పెట్టుకుని తెలంగాణలో ట్రయల్ రన్ వేయాలని బీజేపీ స్కెచ్ వేస్తోంది" అని విమర్శించారు. ఇదే క్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌కు ఆయన ఒక సవాల్ విసిరారు. బండి సంజయ్‌కు నిజంగా అంత దమ్ముంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి అపాయింట్మెంట్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. అంతరాష్ట్ర సరిహద్దు సమస్యలను పరిష్కరించి, గోదావరి నదిపై 'తుమ్మిడిహట్టి ప్రాజెక్టు'ను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటుపై బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత చేసిన విమర్శలకు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. గడిచిన పదేళ్ల పాటు అధికారంలో ఉండి కూడా కవిత ఎందుకు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని పెట్టలేకపోయారని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చామని, త్వరలోనే గౌరవప్రదంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని పీసీసీ చీఫ్ వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu