Ad Code

అమరావతికి రూ. 2,534 కోట్లతో రెండు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

మరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన నేపథ్యంలో, అక్కడ రూ. 2,534 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో మోడీ అమరావతిపై ఈ వరాల జల్లు కురిపించడం విశేషం. ప్రస్తుతం విజయవాడ, గుంటూరు పరిసరాల్లో ముక్కలుముక్కలుగా సాగుతున్న కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు, ఉద్యోగుల వసతి కల్పించేందుకు ఈ నిధులు కేటాయించారు. రాబోయే నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టులు పూర్తి కానున్నాయి. కేంద్ర కేబినెట్ రెండు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట కొలువుదీరేలా 'సెంట్రల్‌ సెక్రటేరియట్‌' నిర్మాణానికి ఆమోదం తెలిపింది మోదీ ప్రభుత్వం. ఈ సెక్రటేరియట్ నిర్మాణానికి 1299 కోట్ల రూపాయలను కేంద్రం ఖర్చు చేస్తోంది. సుమారు 5.53 ఎకరాల విస్తీర్ణంలో 23 లక్షల 25 వేల చదరపు అడుగుల బిల్డప్‌ ఏరియాలో సెక్రటేరియన్ నిర్మాణం చేపడతారు. 8 వేలమంది ఉద్యోగులు పనిచేసేందుకు అవసరమైన సదుపాయాలు ఇందులో ఉంటాయి. 1800 కార్లు పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తారు. స్మార్ట్ సిటీ రూపకల్పనలో భాగంగా ఆధునిక సౌకర్యాలతో నిర్మించే ఈ కాంప్లెక్స్ ద్వారా రాష్ట్రంలో కేంద్ర నిధులు, కార్యాలయాల సమన్వయం మరింత సులభతరం కానుందని అధికారులు తెలిపారు. ఈ కాంప్లెక్స్ నిర్మాణంతో 7.5 లక్షల పని దినాల ఉపాధి లభిస్తుంది. అలాగే, అమరావతిలో పనిచేసే కేంద్ర ఉద్యోగులకు గృహ సముదాయం నిర్మించేందుకూ ఆమోదముద్ర వేసింది కేంద్ర కేబినెట్. 1235 కోట్ల రూపాయల వ్యయంతో మల్టీస్టోరేజ్‌ నివాసాలను నిర్మిస్తారు. ప్రస్తుతం అమరావతిలో ఉద్యోగులకు తగిన అద్దె ఇళ్లు లేకపోవడంతో విజయవాడ, గుంటూరుల నుండి రోజుకు 30-50 కిమీ ప్రయాణించాల్సి వస్తోంది. ఈ ఇబ్బందిని తప్పించేందుకు కార్యాలయాల సమీపంలోనే క్వార్టర్స్ నిర్మిస్తారు. మొత్తం 17 ఎకరాల విస్తీర్ణంలో, 31.30 లక్షల చదరపు అడుగుల నిర్మాణం చేపట్టనున్నారు. టైప్-2 నుండి టైప్-6 కేటగిరీల వరకు మొత్తం 1,504 అత్యాధునిక మల్టీస్టోరేజ్ ఫ్లాట్లు నిర్మిస్తారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి కావడంతో రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ పరిపాలన వేగవంతం అవ్వడమే కాకుండా, వేలాది మంది ఉద్యోగులు వారి కుటుంబాలతో ఇక్కడే స్థిరపడటం వల్ల అమరావతిలో ఆర్థిక, సామాజిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ఏపీ రాజధాని అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా నిలవనుంది. కేంద్రం ఆధీనంలో చేపట్టిన ఈ రెండు భారీ నిర్మాణాలు నాలుగేళ్లలో పూర్తవుతాయని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాజధానిలో పరిపాలనా కార్యకలాపాలు మరింత వేగవంతం కావడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలు కూడా ఒకేచోట నివాసం ఉండడం వల్ల అమరావతికి రాకపోకలు కూడా పెరుగుతాయి.

Post a Comment

0 Comments

Close Menu