తెలంగాణలో ఎండల తీవ్రతపై హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోందని చెప్పింది. అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపు ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. వేడి గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నందున ఆయా జిల్లాల అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం రేవంత్ సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు జిల్లా ఆసుపత్రుల వరకు వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వడదెబ్బతో ఎవరైనా ఆసుపత్రిలో చేరితే తగిన వైద్య సాయం వేగంగా అందించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో చలి వేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం ప్రయాణాలు చేయకుండా ఉండాలని సీఎం సూచించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణ రావును సీఎం రేవంత్ ఆదేశించారు.
0 Comments