Ad Code

భారీ లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం


తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలో నెహ్రు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు మార్గంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పై శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు పక్కన ఆపి ఉంచిన ఒక భారీ లారీని, వెనుక నుంచి అత్యంత వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 16 సమీపంలో చోటుచేసుకుంది. ఢీకొన్న వేగానికి కారు లారీ వెనుక భాగంలోకి పూర్తిగా దూసుకుపోయి ఇరుక్కుపోయింది. దీంతో కారు పైభాగం పూర్తిగా నలిగిపోయి నుజ్జునుజ్జు అయ్యింది. కారులోని ప్రయాణికులకు బయటకు వచ్చే అవకాశం కూడా లేకుండా పోవడంతో, ఆరుగురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు అధికారులు సమాచారం అందించారు. అయితే ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ఉన్నట్లు సమాచారం. ఆరుగురు చనిపోగా మిగిలిన ఆ ఒక్కరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న వాహనదారులు, స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

Post a Comment

0 Comments

Close Menu