పంజాబ్లోని అమృత్సర్, ఖస్సా కంటోన్మెంట్ సమీపంలో ఉన్న బిఎస్ఎఫ్ క్యాంప్ వెలుపల భారీ పేలుడు సంభవించింది. ఈ శబ్దం వినిపించగానే స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడం మరియు ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సరిహద్దు రాష్ట్రంలో ఒకే రోజు రెండు పేలుళ్లు జరగడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై అమృత్సర్ (గ్రామీణ) ఎస్ఎస్పీ సుహైల్ మీర్ ఖాసిం స్పందిస్తూ ప్రాథమిక వివరాలను వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తులు క్యాంప్ ప్రహరీ గోడ వైపు ఏదో పేలుడు వస్తువును విసిరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు జరిగిన వెంటనే అమృత్సర్ గ్రామీణ పోలీసులు, సైనిక బలగాలు రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ మరియు ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలం నుంచి మట్టి నమూనాలను, పేలుడు పదార్థాల అవశేషాలను సేకరించి ల్యాబ్కు పంపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, సిసిటివి దృశ్యాలను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. జలంధర్ మరియు అమృత్సర్ ఘటనల నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హై-సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలు, సైనిక స్థావరాలు మరియు రద్దీగా ఉండే ప్రదేశాల్లో తనిఖీలను ఉధృతం చేశారు. ఈ దాడుల వెనుక ఖలిస్థానీ ఉగ్రవాదుల హస్తం ఉందా లేక ఇతర విచ్ఛిన్నకర శక్తుల కుట్ర ఉందా అనే కోణంలో నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. సరిహద్దు అవతల నుంచి డ్రోన్ల ద్వారా ఏవైనా పేలుడు పదార్థాలు వచ్చి ఉండవచ్చా అనే అంశాన్ని కూడా బీఎస్ఎఫ్ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
0 Comments