ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ గత ఆర్థిక సంవత్సరం (2025-26) నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.500 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని ప్రకటించింది. అయితే, అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో నమోదైన రూ.870 కోట్ల నష్టంతో పోలిస్తే ఈసారి నష్టం 42.5 శాతం తగ్గింది. ఆదాయం 57 శాతం క్షీణించి రూ.611 కోట్ల నుంచి రూ.265 కోట్లకు దిగజారింది. ఆదాయం తగ్గినా, స్థూల మార్జిన్లు మెరుగయ్యాయి. ఇవి వార్షిక ప్రాతిపదికన 13.7% నుంచి 38.5 శాతానికి చేరాయి. పీఎల్ఐ ప్రోత్సాహకాలు, మెరుగైన స్థూల మార్జిన్లు, కఠినమైన వ్యయ నియంత్రణ కారణంగా కంపెనీ చరిత్రలో తొలిసారిగా కార్యకలాపాల నగదు ప్రవాహం పాజిటివ్గా మారి క్యూ4లో రూ.91 కోట్లుగా నమోదైంది. ఆటోమొబైల్ వ్యాపారం నుంచి రూ.213 కోట్ల ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో, రూ.173 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లో (ఎఫ్సీఎఫ్) నమోదయ్యాయి. మార్చి త్రైమాసికంలో మొత్తం 20,256 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కంపెనీ విక్రయించింది. ఇక పూర్తి 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ మొత్తం రూ.2,253 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా.. రూ.1,833 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఓలా ఎలక్ట్రిక్ మొత్తం 1,73,794 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను డెలివరీ చేసింది.
0 Comments