కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఏన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందు స్వాతంత్ర్యం తర్వాత బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని సువేందు అధికారి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్తో కొత్త శకం ప్రారంభం కాబోతోందని అన్నారు. నేటితో సోనార్ బంగ్లా రోజులు అధికారికంగా మొదలయ్యాయని సువేందు అధికారి పేర్కొన్నారు. 'పశ్చిమ బెంగాల్కు నేడు ఒక చరిత్రాత్మక ఉదయం. కోల్కతా వస్తున్న దార్శనిక నాయకుడు, ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం. స్వాతంత్ర్యం తర్వాత పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటి బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారమనేది మన వ్యవస్థాపక పితామహుల కలలను సాకారం చేస్తోంది. నేడు దశాబ్దాల దుష్పరిపాలనకు ముగింపు పలుకుతున్నాం. అభివృద్ధి, శాంతి, శ్రేయస్సులతో కూడిన డబుల్ ఇంజిన్ శకానికి నాంది పలుకుతున్నాం. సోనార్ బంగ్లా శకం అధికారికంగా ప్రారంభమైంది' అంటూ సువేందు అధికారి పోస్టు పెట్టారు.
0 Comments