బీహార్ రాష్ట్ర పర్యాటక రంగాన్ని, గ్రామీణ మౌలిక సదుపాయాలను సరికొత్తగా మార్చడం కోసం ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగులు ప్రతి మూడు నెలలకోసారి తమ కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రంలోని ఏదైనా ఒక పర్యాటక, పర్యావరణ లేదా గ్రామీణ ప్రాంతాన్ని సందర్శించి, అక్కడ కనీసం రెండు రాత్రులు బస చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ టూర్ వ్యవధిని అధికారులు "విధి నిర్వహణ" లో గడిపినట్లుగానే పరిగణిస్తారు. సాధారణ పరిపాలన విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి. రాజేందర్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వినూత్న పర్యటనలో శుక్రవారం, శనివారం రాత్రులు కచ్చితంగా స్థానిక ప్రాంతాల్లోనే గడపాలని, చుట్టుపక్కల కనీసం మూడు పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని నిబంధన విధించారు. అయితే, ఈ పర్యటనలకు ప్రభుత్వం ఒక కఠినమైన కండిషన్ పెట్టింది. ఈ టూర్లను అధికారిక పనులతో లేదా సైట్ తనిఖీలతో అస్సలు కలపకూడదు. ఈ పర్యటన సమయంలో ఏ అధికారి కూడా ఎలాంటి అధికారిక సమీక్షా సమావేశాలు గానీ, ఆఫీస్ ఫైళ్ల తనిఖీలు గానీ నిర్వహించకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కేవలం పర్యాటకుడిలా వెళ్లి అక్కడి వాతావరణాన్ని అనుభవించడమే అధికారుల పని. ఈ నిబంధన రాష్ట్రంలోని అదనపు ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, డివిజనల్ కమిషనర్లు, జిల్లా మేజిస్ట్రేట్లు, ఐపీఎస్, అటవీ శాఖ అధికారులతో సహా ఉన్నతాధికారులందరికీ వర్తిస్తుంది. అయితే, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వంటి ఉన్నత స్థాయి అధికారులు తాము ప్రస్తుతం ఏ జిల్లాలో అయితే ఉద్యోగం చేస్తున్నారో, ఆ జిల్లాను మినహాయించి, పక్కనే ఉన్న ఇతర జిల్లాల్లో ఈ రెండు రోజుల బసను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. బీహార్ అంటే కేవలం గయ, బోధ్గయ, నలంద మాత్రమే కాదని.. ప్రపంచ వేదికపైకి రావలసిన ఎన్నో చారిత్రక, సాంస్కృతిక, పర్యావరణ ప్రాంతాలు రాష్ట్రంలో దాగి ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. అధికారులు తమ టూర్ ముగించుకుని వచ్చిన తర్వాత.. తాము సందర్శించిన ప్రాంతాల అందమైన ఫోటోలు, అక్కడి వసతుల సమాచారం, స్థానికంగా తాము పొందిన వ్యక్తిగత అనుభవాలతో కూడిన పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను కూడా ప్రభుత్వం నియమించింది. ఈ కార్యక్రమం ద్వారా పర్యాటక ప్రాంతాల్లో 'హోమ్స్టే' సంస్కృతిని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పర్యాటకులు స్థానిక ఇళ్లలోనే డబ్బులు చెల్లించి బస చేయడం వల్ల వారికి ప్రామాణికమైన బీహారీ సంస్కృతి, స్థానిక వంటకాలు పరిచయమవుతాయి. తద్వారా స్థానిక ప్రజల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అధికారుల రాక పెరుగుతుంది. జిల్లా వెబ్సైట్లలో ప్రభుత్వ అతిథి గృహాలు, ప్రైవేట్ హోటళ్లు, హోమ్స్టేల వివరాలను రేట్లతో సహా అప్లోడ్ చేయాలని జిల్లా యంత్రాంగాలను ప్రభుత్వం ఆదేశించింది.
0 Comments