ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో సమావేశమైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆమెకు భారతీయ కంపెనీ 'పార్లే ప్రొడక్ట్స్'కు చెందిన చాక్లెట్ టాఫీ 'మెలోడీ' ప్యాకెట్ను బహుమతిగా ఇచ్చారు. భారతదేశంలో పార్లే మెలోడీ ఒక్క టాఫీ ధర కేవలం ఒక్క రూపాయి మాత్రమే. ఈ పార్లే ప్రొడక్ట్స్ సంస్థ 97 సంవత్సరాల క్రితం ముంబైలో స్థాపించబడింది. ప్రారంభంలో దీని పేరు 'హౌస్ ఆఫ్ పార్లే'. నేడు ఈ కంపెనీ 21 కి పైగా దేశాలలో తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా దీనికి 125 కి పైగా ఫ్యాక్టరీలు ఉన్నాయి. మోహన్లాల్ దయాల్ క్యాండీలు తయారు చేయడం కోసం ఈ సంస్థను స్థాపించారు. 1939 నుండి ఈ కంపెనీ 'పార్లే గ్లూకో' పేరుతో బిస్కెట్ల తయారీని ప్రారంభించింది. ప్రస్తుతం పార్లే-జి సంస్థ బిస్కెట్లతో పాటు చాక్లెట్లు, టాఫీలు, కేకులు, రస్కులు, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ సిరియల్స్ మరియు పిండిని కూడా తయారు చేసి విక్రయిస్తోంది. పార్లే-జితో పాటు హైడ్ అండ్ సీక్, క్రాక్జాక్, మొనాకో, కిస్మి, మెలోడీ,పార్లే రస్క్ మొదలైనవి దీని ప్రసిద్ధ ఉత్పత్తులు. మోహన్లాల్ కేవలం 12 మంది సభ్యులతో తన ఫ్యాక్టరీని ప్రారంభించారు. వీరంతా మోహన్లాల్ కుటుంబ సభ్యులే కావడం గమనార్హం. ఫ్యాక్టరీ ప్రారంభమైన 10 సంవత్సరాల తర్వాత, అంటే 1939లో పార్లే బిస్కెట్ల తయారీని మొదలుపెట్టింది. అప్పటివరకు భారతదేశంలో లభించే బిస్కెట్లు విదేశాల నుండి దిగుమతి చేసుకునేవారు, అందువల్ల అవి చాలా ఖరీదైనవిగా ఉండేవి. పార్లే సంస్థ సాధారణ ప్రజల కోసం అతి తక్కువ ధరకే తన బిస్కెట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. చూస్తూ చూస్తూనే ఇది దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్-ఇండియన్ ఆర్మీలో కూడా పార్లే బిస్కెట్లకు విపరీతమైన డిమాండ్ ఉండేది. స్వాతంత్ర్యం తర్వాత నిలిచిపోయిన బిస్కెట్ ఉత్పత్తి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అదే సంవత్సరంలో దేశ విభజన కూడా జరగడంతో అకస్మాత్తుగా దేశంలో గోధుమల కొరత ఏర్పడింది. గ్లూకో బిస్కెట్లకు గోధుమలే ప్రధాన ముడిసరుకు కావడంతో పార్లే తన ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయవలసి వచ్చింది. ఈ సంక్షోభం నుండి గట్టెక్కడానికి పార్లే సంస్థ బార్లీతో తయారు చేసిన బిస్కెట్లను మార్కెట్లోకి తెచ్చింది.
0 Comments