కేరళలో ఆస్తి కోసం కన్నతల్లిని, సోదరుడిని ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా హత్య చేసి, వారి మృతదేహాలను ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. నెలరోజుల క్రితం ఇడుక్కి జిల్లా లో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పొన్నూట్టిల్ కుటుంబానికి చెందిన సజీ (45) తన తమ్ముడు రెజీ (40), తల్లి మేరీకుట్టి (65) తో కలిసి నివసిస్తున్నాడు. ఆ కుటుంబానికి చెందిన సుమారు ఎకరం భూమిని పంచుకోవడంపై సోదరుల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో నెలరోజుల క్రితం ఓ రాత్రి రెజీ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఈ సందర్భంగా అన్నదమ్ములు ఇద్దరికీ గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో రెజీ ముఖంపై సజీ తీవ్రంగా దాడి చేశాడు. అతను స్పృహ కోల్పోయిన తర్వాత టవల్తో గొంతు నులిమి హత్య చేశాడు. ఈ హత్యను చూసిన తన తల్లి మేరీకుట్టిని కూడా ముఖంపై కొట్టి, ఊపిరాడకుండా చేసి చంపేశాడు. రెండు రోజుల పాటు మృతదేహాలను ఇంట్లోనే దాచిపెట్టి, ఆ తర్వాత ఇంటి ఆవరణలోనే గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు. ఈ హత్యలు చేయడంలో తనకు ఎవరూ సహాయం చేయలేదని, ఒక్కడినే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని సజీ పోలీసుల ఎదుట అంగీకరించాడు. నెల రోజుల నుంచి మేరీకుట్టి, రెజీ కనిపించకపోవడంతో సజీని ఆరాతీశారు. అయితే సజీ వారికి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దాంతో అనుమానించి ఇరుగుపొరుగు అనక్కరలో ఉండే వారి సోదరి సనీకి సమాచారం ఇచ్చారు. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సజీ ఇంటికి వెళ్లాడు. పోలీసులను చూడగానే సజీ పారిపోయాడు. దాంతో అనుమానించిన పోలీసులు ఇంటి ఆవరణను పరిశీలించారు. తవ్వి పూడ్చిన ఆనవాళ్లు కనిపించడంతో తిరగతోడించగా రెజీ, మేరీకుట్టి మృతదేహాలు బయటపడ్డాయి. అనంతరం నిందితుడి కోసం తీవ్రంగా గాలించి ఈ నెల 28న అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా 2018లో సజీ తండ్రి మాథ్యూ కూడా అదృశ్యమయ్యాడు. దాంతో ఆ ఘటనతో ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా..? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments