ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం అయ్యవారిపల్లె సమీపంలో వంద ఎకరాల్లో ఏర్పాటు కానున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్క్కు సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో భూమిపూజ చేశారు. కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ హిమవంశీ పాల్గొని కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వలేటివారిపాలెం మండలం వెనుకబడిన ప్రాంతమని, ఉపాధి అవకాశాల లేమితో యువత ఇతర నగరాలకు వలస వెళ్తున్నారని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పార్క్ ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు. ఈ పార్క్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్లకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినట్లు చెప్పారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. పార్క్ ద్వారా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పడి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
0 Comments