Ad Code

జెట్ ఫ్యూయల్ ధర మరో 5 శాతం పెంపు


ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన ధరల అస్థిరత, ఇరాన్ యుద్ధ సంక్షోభం ప్రభావంతో విమాన ఇంధనం ధరలను శుక్రవారం మరో 5 శాతం పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వరుసగా రెండో నెల కూడా ధరలు పెరగడం అంతర్జాతీయ విమానయాన రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఢిల్లీలో అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ధర కిలోలీటరుకు 76.55 డాలర్లు పెరిగింది. దీనితో కొత్త ధర కిలోలీటరుకు రూ.1,511.86 డాలర్లకు చేరింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీసుకున్న ఈ తాజా నిర్ణయం కేవలం అంతర్జాతీయ విమానయాన సంస్థలు, విదేశీ క్యారియర్లకు మాత్రమే వర్తిస్తుంది. దేశీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. విమానయాన రంగంపై భారాన్ని తగ్గించే ఉద్దేశంతో దేశీయ సంస్థల ధరలను నియంత్రిత పద్ధతిలో ఉంచుతున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇరాన్ యుద్ధ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం ఏటీఎఫ్ రేట్లపై నేరుగా ప్రభావం చూపుతోంది. ఇంధన ధరల పెరుగుదల వల్ల కలిగే పూర్తి భారాన్ని ఒకేసారి వినియోగదారులపై పడకుండా చమురు సంస్థలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీనిలో భాగంగానే అంతర్జాతీయ ఆపరేటర్లకు మార్కెట్ లింక్డ్ రేట్లు వర్తింపజేస్తున్నారు. ఏటీఎఫ్ ధరలు ఒక ఎయిర్‌లైన్ నిర్వహణ వ్యయంలో అధిక ప్రభావం చూపుతాయి. ఈ పెంపుతో భారతీయ మార్గాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ విమానయాన సంస్థల ఖర్చులు భారీగా పెరగనున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల క్రితమే భారతదేశంలో ఏటీఎఫ్ ధరల నియంత్రణను తొలగించారు. అప్పటి నుంచి అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలకు అనుగుణంగా ఎయిర్‌లైన్స్, ఆయిల్ కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతి నెలా ధరలను సవరిస్తున్నారు. ఏప్రిల్ 1న దేశీయ విమానయాన సంస్థల ఏటీఎఫ్ ధరలను 25 శాతం పెంచి రూ.1,04,927.18కు చేర్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో విదేశీ ప్రయాణాలకు టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu