ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్-ఎఫ్అండ్ఓ విభాగంలో ట్రేడింగ్ సమయాలను పొడిగిస్తున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 3 నుంచి ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లో సాధారణ ట్రేడింగ్ ముగింపు సమయం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 3:40 గంటలకు మారనుంది. ప్రీ-ఓపెన్ సెషన్, మార్కెట్ ప్రారంభ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. క్యాష్ మార్కెట్లో ప్రవేశపెట్టనున్న 'క్లోజింగ్ ఆక్షన్ సెషన్'తో డెరివేటివ్స్ ట్రేడింగ్ సమయాలను సమలేఖనం చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ఎన్ఎస్ఈ వెల్లడించింది. కొత్త విధానంలో క్యాష్ మార్కెట్లో మధ్యాహ్నం 3:15 నుంచి 3:35 గంటల వరకు క్లోజింగ్ ఆక్షన్ నిర్వహించి, ఆ రోజు అధికారిక ముగింపు ధరను నిర్ణయించనున్నారు. క్లోజింగ్ ఆక్షన్ సమయంలో ఏర్పడే ధరల మార్పులను దృష్టిలో ఉంచుకుని, ఎఫ్అండ్ఓ ట్రేడర్లు తమ పొజిషన్లను హెడ్జ్ చేసుకోవడానికి, సర్దుబాటు చేసుకోవడానికి లేదా ఎగ్జిట్ కావడానికి అదనంగా 10 నిమిషాల సమయం లభిస్తుంది. దీంతో క్యాష్, డెరివేటివ్స్ మార్కెట్ల మధ్య ముగింపు సమయాల్లో ఉండే వ్యత్యాసం తగ్గి, ధరల ఆవిష్కరణ మరింత సమర్థవంతంగా జరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ట్రేడ్ మాడిఫికేషన్ సౌకర్యం సాయంత్రం 4:15 గంటల వరకు కొనసాగుతుంది ఎఫ్అండ్ఓ క్లోజింగ్ ధరల లెక్కింపునకు ఉపయోగించే VWAP విండోను 3:10-3:40 గంటల మధ్య ట్రేడింగ్కు అనుగుణంగా సవరించనున్నారు. గత కొంతకాలంగా డెరివేటివ్స్ మార్కెట్లో ఎన్ఎస్ఈ పలు సంస్కరణలను అమలు చేస్తోంది. 2025 చివర్లో ఎఫ్అండ్ఓ విభాగంలో ప్రీ-ఓపెన్ సెషన్ను ప్రవేశపెట్టగా, ఇప్పుడు క్లోజింగ్ ఆక్షన్ వ్యవస్థకు అనుగుణంగా ట్రేడింగ్ సమయాన్ని కూడా పొడిగిస్తోంది. మార్కెట్ పారదర్శకత, మెరుగైన ధరల నిర్ణయం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వ్యవస్థను తీర్చిదిద్దడమే ఈ మార్పుల లక్ష్యంగా పేర్కొంటున్నారు.
0 Comments