అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) కింద సభ్యుల సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026-27) 10 కోట్ల మార్క్ను అధిగమిస్తుందని పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్ఆర్డీఏ) చైర్మన్ ఎస్ రామన్ తెలిపారు. 2026 మార్చి చివరికి ఏపీవై సభ్యులు 8.96 కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2025 మార్చి నాటికి)లో సభ్యుల సంఖ్య 7.61 కోట్లతో పోల్చితే, గత ఆర్థిక సంవత్సరంలో 1.35 కోట్ల మంది కొత్త సభ్యులు జతయ్యారు. 18 శాతం వార్షిక వృద్ధి అంచనా ఆధారంగా సభ్యుల సంఖ్య 10 కోట్ల మార్క్ను అధిగమిస్తుందని అంచనా వేస్తున్నట్టు రామన్ పేర్కొన్నారు. ఎన్పీఎస్ కూడా పీఎఫ్ఆర్డీఏ నియంత్రణల కిందే నడుస్తుండడం గమనార్హం. 18-25 ఏళ్ల వయసు వారి నుంచి ఎక్కువ మంది సభ్యులు చేరుతున్నారని.. దీర్ఘకాల ఆర్థిక భద్రతపై యువతలో అవగాహన పెరుగుతుండడాన్ని ఇది సూచిస్తున్నట్టు రామన్ చెప్పారు. ఎన్పీఎస్ కింద 2026 మార్చి నాటికి 2.17 కోట్ల మంది సభ్యులు ఉండగా, వీరికి సంబంధించి రూ.15.95 లక్షల కోట్ల పింఛను నిధి నిర్వహణలో ఉన్నట్టు రామన్ తెలిపారు. ఈ ఏడాది ఎన్పీఎస్ సభ్యుల సంఖ్య 22 శాతం పెరగొచ్చని అంచనా వేశారు.
0 Comments