Ad Code

లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జాపై కాల్పులు : పరిస్థితి అత్యంత విషమం


పాకిస్తాన్ లోని లాహోర్ లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జా పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. 66 ఏళ్ల అమీర్ హమ్జా పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు స్థానిక వర్గాల నుంచి సమాచారం అందుతోంది. లాహోర్ లోని ఓ న్యూస్ ఛానెల్ బయట ఈ దాడి జరిగినట్లు స్పష్టం అవుతోంది. లష్కరే తొయిబా చీఫ్ అయిన హఫీజ్ సయీద్ తర్వాత ఆ సంస్థలో అమీర్ హమ్జాను అత్యంత కీలకమైన అలాగే రెండో అతిపెద్ద నాయకుడిగా పరిగణిస్తారు. లాహోర్ లోని హమ్దార్ద్ చౌక్ వద్ద ఉన్న ఓ న్యూస్ ఛానెల్ బయట ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్లు పరారయ్యారు. ఇదంతా క్షణాల్లోనే జరిగిపోయింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హమ్జా పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హఫీజ్ సయీద్ తో కలిసి అమీర్ హమ్జా లష్కరే తోయిబాను స్థాపించాడు. భారత్ లో జరిగిన పలు ఉగ్ర దాడుల్లో హమ్జా ప్రమేయం ఉన్నట్లు గతంలోనే నిఘా వర్గాలు తేల్చాయి. లష్కరే తోయిబా అధికారిక పత్రికగా పేరొందిన మజల్లా అల్ దావా కు హమ్జా సంపాదకుడిగా పనిచేశాడు. అలాగే తీవ్రవాదం భావజలాన్ని ప్రేరేపించేలా పలు పుస్తకాలు కూడా రాసినట్లు తెలుస్తోంది. లష్కరే తోయిబాను అమెరికా ట్రెజరీ డిపార్ట్ మెంట్ అంతర్జాతీయ టెర్రరిస్టు ఆర్గనైజేషన్ గా ప్రకటించింది. అలాగే అమీర్ హమ్జాను ఉగ్రవాదుల లిస్టులో చేర్చింది. అలాగే ఖైదీలుగా ఉన్న ఉగ్రవాదుల కోసం ఫండ్ రైజింగ్, రిక్రూట్ మెంట్, చర్చలు జరపడంలో ఆయన దిట్ట అయినట్లు అని తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu