Ad Code

తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడాలి !


కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు అన్నారు. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం కుప్పలుతెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ఎందుకు మొదలుపెట్టలేదని ప్రశ్నించారు. మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో, రెండు కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారన్నారు. ఎండల్లో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదా? ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొద్దుతిరుగుడు రైతుల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? 20 రోజులుగా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని, కేంద్రం పావు వంతు మాత్రమే పొద్దుతిరుగుడు కొనుగోలు చేసిందని ఆయన తెలిపారు. మిగతా 1.20 లక్షల క్వింటాళ్లను రాష్ట్ర ప్రభుత్వమే బేషరతుగా కొనాలన్నారు. శనగ రైతుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు శనిలా మారాయంటూ కేంద్రాల్లో కొర్రీలు పెట్టి పూర్తిగా కొనుగోళ్లు నిలిపివేశారని, మద్దతు ధర రూ. 5,875 ఉంటే ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు మూడు, నాలుగు వేలకే రైతులు అమ్ముకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారని నిలదీశారు. కనీస మద్దతు ధర రూ.3371 ఉంటే ప్రైవేటు వ్యక్తులకు రూ.2500కే అమ్ముకుని రైతులు నష్టపోతున్నారన్నారు. మొక్కజొన్న రైతులపై వివక్ష ఎందుకంటూ ఎకరాకు 26.50 క్వింటాళ్లే కొంటామనే నిబంధనను సడలించాలని డిమాండ్ చేశారు. ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల మొక్కజొన్న పండితే మిగతా పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలి అని అడిగారు. తక్షణమే అన్ని రకాల పంటలను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హరీష్‌రావు హెచ్చరించారు.

Post a Comment

0 Comments

Close Menu