ఆరోగ్యం కోసం మనం వాడే అశ్వగంధ విషయంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అశ్వగంధ వేర్లు అమృతం లాంటివని మనకు తెలుసు, కానీ దాని ఆకులు మాత్రం ఆరోగ్యానికి చేటు చేస్తాయని హెచ్చరిస్తోంది. సాధారణంగా మనం అశ్వగంధ అనగానే అది ఆయుర్వేద మూలిక కదా, ఏ భాగం వాడినా ఫర్వాలేదు అనుకుంటాం. కానీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ తాజా పరిశోధనల ప్రకారం అశ్వగంధ ఆకులను వాడటం వల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉందని తేలింది. వీటిని పౌడర్ రూపంలో లేదా ఇతర ఏ రూపంలో తీసుకున్నా మన శరీరంలోని నరాల వ్యవస్థపై, జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపుతాయట. అందుకే ఆహార పదార్థాల్లో గానీ, హెల్త్ సప్లిమెంట్లలో గానీ ఈ ఆకులను వాడకూడదని ప్రభుత్వం కఠినమైన నిషేధం విధించింది. కేవలం వేర్లు మాత్రమే సురక్షితమని స్పష్టం చేసింది. ఇకపై అశ్వగంధ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలు తాము మొక్కలోని ఏ భాగాన్ని వాడుతున్నామో ప్యాకెట్లపై స్పష్టంగా రాయాలని ప్రభుత్వం ఆదేశించింది. కేవలం “అశ్వగంధ” అని రాసి వదిలేయడం కుదరదు అది వేరా లేక వేరు నుంచి తీసిన సారామా అనేది తప్పనిసరిగా పేర్కొనాలి. ఆకులను వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాల దృష్ట్యా, కస్టమర్లకు సరైన సమాచారం చేరాలన్నదే ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రధాన ఉద్దేశం. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అశ్వగంధ ఆకుల్లో ఉండే కొన్ని రకాల రసాయనాలు మన జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడతాయి. కొంతమంది వీటిని బరువు తగ్గడానికో లేదా ఇతర కారణాలతో తీసుకుంటూ ఉంటారు, కానీ శాస్త్రీయంగా ఇవి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు వీటి జోలికి వెళ్తే పరిస్థితి విషమించే అవకాశం ఉంది. అందుకే మనం ఏదైనా అశ్వగంధ పొడి కొనేటప్పుడు అది కేవలం వేర్ల ద్వారా తయారైనదా కాదా అనేది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.
0 Comments