కృత్రిమ మేధ ప్రపంచ ఐటీ సేవల పరిశ్రమను పునర్నిర్మిస్తూ, పలు కంపెనీలలో ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణకు కారణమవుతున్నప్పటికీ తాము మాత్రం ఆ మార్గాన్ని అనుసరించబోమని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ స్పష్టంచేశారు. మనీకంట్రోల్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పరేఖ్ .. సాఫ్ట్వేర్ను నిర్మించే, అందించే విధానంలో ఆటోమేషన్, ఏఐ సాధనాలు మరింత కీలకంగా మారుతున్నప్పటికీ, తమ కంపెనీ గతేడాది ఎలాంటి ఉద్యోగాల కోతలు చేపట్టలేదని, భవిష్యత్తులో కూడా అలాంటి చర్యలు తీసుకునే ఆలోచన లేదని అన్నారు. ఐటీ పరిశ్రమలో కొనసాగుతున్న ఏఐ మార్పు తక్షణమే ఉద్యోగాలను తగ్గించేది కాదని పరేఖ్ తేల్చేశారు. ఏఐ పని పరిధిని విస్తరింపజేస్తోంది గానీ, కుదించడం లేదన్నారు. ఉద్యోగాల స్వభావం మారుతున్నప్పటికీ, ప్రతిభావంతులకు డిమాండ్ కొనసాగుతుందన్నారు. అనేక ఐటీ సంస్థలు భిన్నమైన మార్గాన్ని అనుసరిస్తున్న తరుణంలో ఇన్ఫోసిస్ సీఈవో వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇకపైనా ఉద్యోగాలను తగ్గించకుండా తన నియామకాల వేగాన్ని కొనసాగించాలని ఇన్ఫోసిస్ యోచిస్తోంది. గత ఏడాది మాదిరిగానే, ఈ ఏడాది కూడా 20వేల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకోనుంది. సిబ్బంది సంఖ్యను తగ్గించడం కంటే, నైపుణ్యాలను తిరిగి నేర్పించడంపైనే దృష్టి సారించామని పరేఖ్ అన్నారు. ఇంజనీర్లకు సాంప్రదాయ కోడింగ్ పద్ధతులు, ఏఐ-ఆధారిత సాధనాలు రెండింటితోనూ పనిచేసేలా శిక్షణ ఇస్తున్నారు.
0 Comments