ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని భావిస్తున్న మద్యం కుంభకోణం కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ, సుప్రీంకోర్టు కూడా బెయిల్ తిరస్కరించిన ఏ1 రాజ్ కెసిరెడ్డికి హైకోర్టులో మాత్రం ఊరట లభించింది. దాదాపు రూ.3500 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు భావిస్తున్న మద్యం స్కాంలో రాజ్ కెసిరెడ్డిని గతేడాది సీఐడీ సిట్ అరెస్టు చేేసింది. అప్పటి నంచి ఆయన జైల్లోనే ఉన్నారు. మధ్యలో హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఆయన బెయిల్ పిటిషన్లను తిరస్కరించాయి. కానీ ఈసారి హైకోర్టు ఆరోగ్య కారణాలతో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతని ఆరోగ్య పరిస్దితిపై లాయర్ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మద్యం స్కాంలో రాజ్ కెసిరెడ్డితో పాటు పలువురు నిందితుల్ని ఇప్పటికే సీఐడీ సిట్ అరెస్టులు చేయడం, ఆ తర్వాత బెయిల్ లభించడం జరిగిపోయాయి. మరోవైపు ఈడీ కూడా కేసులు నమోదు చేసి మద్యం స్కాంపై విచారణ జరుపుతోంది. ఇలాంటి సమయంలో ప్రధాన నిందితుడైన రాజ్ కెసిరెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నట్లు తెలుస్తోంది.
0 Comments