అమెరికాలోని న్యూయార్క్ మాన్హాటన్ జిల్లా అటార్నీ కార్యాలయంలో అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాల చెర నుంచి విముక్తి పొందిన సుమారు రూ. 117 కోట్లు విలువైన 657 అపురూప కళాఖండాలను భారత కాన్సులేట్ ప్రతినిధి రాజలక్ష్మి కదమ్కు అధికారికంగా అప్పగించారు. వీటిలో కొన్ని అత్యంత విలువైన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన శిల్పాలు ఉన్నాయి. అవలోకితేశ్వరుని కంచు విగ్రహం విలువ సుమారు 2 మిలియన్ డాలర్లు. 1982లో రాయ్పూర్లోని మ్యూజియం నుండి దొంగిలించిన ఈ విగ్రహాన్ని, 2025లో న్యూయార్క్లోని ఒక ప్రైవేట్ సేకరణ నుండి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెడ్ ఐరన్స్టోన్ బుద్ధ విగ్రహం విలువ సుమారు 7.5 మిలియన్ డాలర్లు. ఇది కపూర్ నెట్వర్క్ ద్వారా అక్రమంగా అమెరికాకు చేరింది. నాట్య గణేశుడి విగ్రహం 2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని ఒక ఆలయం నుండి దొంగిలించిన ఈ శిల్పాన్ని, నకిలీ పత్రాలతో 2012లో వేలం వేశారు. అంతర్జాతీయ స్మగ్లర్ సుభాష్ కపూర్, దోషిగా తేలిన నాన్సీ వీనర్లకు సంబంధించిన నెట్వర్క్లపై జరిపిన సుదీర్ఘ దర్యాప్తులో ఈ వస్తువులు వెలుగుచూశాయి. 2012 నుండి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్, పురావస్తు అక్రమ రవాణా నిరోధక విభాగం సంయుక్తంగా ఈ ముఠాలను వెంబడిస్తున్నాయి. “భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ అక్రమ రవాణా నెట్వర్క్ల పరిధి చాలా పెద్దది. దొంగిలించిన మన సంపదను తిరిగి తీసుకురావడానికి ఇంకా నిరంతర కృషి అవసరం,” అని జిల్లా అటార్నీ ఆల్విన్ ఎల్ బ్రాగ్ జూనియర్ పేర్కొన్నారు. మాన్హాటన్ ATU విభాగం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 36 దేశాలకు చెందిన 5,900కు పైగా వస్తువులను తిరిగి అప్పగించింది. వీటి మొత్తం విలువ 485 మిలియన్ డాలర్ల పైమాటే. భారతదేశంలో ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్న సుభాష్ కపూర్ను అమెరికాకు అప్పగించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ భారీ ఆపరేషన్ భారత్ – అమెరికా దేశాల మధ్య సమన్వయం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. మన ప్రాచీన కళా సంపదను కాపాడుకోవడంలో అంతర్జాతీయ సహకారం ఎంత అవసరమో ఈ సంఘటన మరోసారి నిరూపించింది.
0 Comments