జపాన్లో సోమవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 7.5గా నమోదైంది. భూకంపం ధాటికి సముద్ర తీర ప్రాంతాలు ఒక్కసారిగా వణికిపోయాయి. భూకంపం అనంతరం అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. జపాన్ ప్రధాని సనాయే తకైచి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి, ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. జపాన్ కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సాన్రికు తీరానికి సమీపంలో భూమి కంపించింది. సముద్ర ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం వచ్చిన కొద్దిసేపటికే ఇవాటే ప్రాంతంలోని కుజీ ఓడరేవు వద్ద 80 సెంటీమీటర్ల ఎత్తులో సునామీ అలలు నమోదయ్యాయి. తీర ప్రాంతాలకు దాదాపు 10 అడుగుల ఎత్తులో సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూకంపం కారణంగా జపాన్లో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భద్రతా కారణాల దృష్ట్యా టోక్యో – షిన్-అఒమోరి మధ్య నడిచే తోహోకు షింకన్సెన్ బుల్లెట్ రైలు సేవలను నిలిపివేశారు. యమగాటా, అకితా షింకన్సెన్ సేవలు కూడా నిలిచిపోయాయి. అలాగే ఇవాటే ప్రాంతంలోని అన్ని లోకల్ రైళ్లను నిలిపివేశారు. హోక్కైడోలో కూడా కొన్ని రైలు మార్గాలు మూతపడ్డాయి. షిన్-చిటోస్, సెండాయ్ విమానాశ్రయాల కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగలేదని అధికారులు స్పష్టం చేశారు.
0 Comments