ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఉద్యోగుల కొంపముంచుతోంది. ఈ క్రమంలోనే భారీ పెట్టుబడులు, పెరిగిన వ్యయాలు మైక్రోసాఫ్ట్, మెటా సంస్థలను కఠిన నిర్ణయాల దిశగా నడిపించాయి. ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ రెండు దిగ్గజ సంస్థలు సుమారు 23,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపే ప్రణాళికలను రూపొందించాయి. మెటా తన అంతర్గత మెమోలో ఈ ప్రకటన చేసింది. సంస్థలోని మొత్తం సిబ్బందిలో 10 శాతం అంటే సుమారు 8,000 మందిని తొలగించనున్నట్లు పేర్కొంది. మే 20 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రక్రియతో పాటు, సంస్థలోని 6,000 ఖాళీలను కూడా భర్తీ చేయకూడదని నిర్ణయించుకుంది. కంపెనీని మరింత సమర్థవంతంగా, చురుకుగా మార్చే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మెటా స్పష్టం చేసింది. మరోవైపు, మైక్రోసాఫ్ట్ తన అమెరికా ఉద్యోగుల కోసం భారీ స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. అమెరికాలోని 1.25 లక్షల మంది ఉద్యోగులలో దాదాపు 7 శాతం మంది, అంటే 8,750 మంది ఈ ఆఫర్కు అర్హులుగా తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద బైఅవుట్ కార్యక్రమంగా నిలవనుంది. ప్రస్తుతం టెక్ రంగం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రం జపిస్తోంది. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా కొత్త డేటా సెంటర్ల నిర్మాణంతో పాటు జపాన్, ఆస్ట్రేలియాల్లో బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెడుతోంది. మెటా సైతం ఏఐ భాగస్వామ్యాల కోసం రికార్డు స్థాయి వ్యయం చేస్తోంది. AI ద్వారా పెట్టుబడుల భారం తగ్గించుకోవాలని దిగ్గజ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కృత్రిమ మేధ కోసం చేస్తున్న భారీ ఖర్చులను సమతుల్యం చేయడం కోసం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అలాగే తక్కువ మానవ వనరులతో సాంకేతికత ద్వారా ఎక్కువ ఫలితాలను సాధించాలని సాఫ్ట్వేర్ సంస్థలు భావిస్తున్నాయి. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సంస్థలను పునర్నిర్మించాలనుకుంటున్నాయి. టెక్ రంగ నిపుణుల విశ్లేషణ ప్రకారం, కంపెనీలు ఇప్పుడు మనుషుల కంటే మెషీన్ లెర్నింగ్, ఏఐ మౌలిక సదుపాయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి.
0 Comments