యుద్ధం ఎప్పుడు ముగియాలో అమెరికా కాదు, మేమే నిర్ణయిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఇలాగే కొనసాగితే, ఈ ప్రాంతం నుండి "ఒక్క లీటర్ చమురు" కూడా బయటకు వెళ్లకుండా అడ్డుకుంటామని ఐఆర్జీసీ ప్రతినిధి హెచ్చరించారు. "ప్రాంతీయ భద్రత అనేది అందరికీ ఉండాలి, లేదంటే ఎవరికీ ఉండకూడదు" అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు. ఒకవేళ ఇరాన్ చమురు రవాణాను అడ్డుకోవాలని చూస్తే తాము 20 రెట్లు కఠినంగా స్పందిస్తామని చెప్పారు. "ఇరాన్ కోలుకోలేనంతగా నాశనం చేస్తాం.. చావు, మంటలు, ఆగ్రహం వారిపై వర్షిస్తాయి" అని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే ఇరాన్ డ్రోన్ తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం వల్ల డ్రోన్ దాడులు 83% తగ్గాయని ఆయన వెల్లడించారు. గత శనివారం అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో టెహ్రాన్ మరియు అల్బోర్జ్ ప్రాంత్నాల్లోని ఐదు ప్రధాన చమురు నిల్వ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. దీనివల్ల భారీగా మంటలు ఎగసిపడటమే కాకుండా, నగరం మొత్తం విషపూరితమైన పొగతో నిండిపోయింది. యాసిడ్ వర్షం కురిసే అవకాశం ఉందని ఇరాన్ రెడ్ క్రెసెంట్ హెచ్చరించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. తమ వద్ద భారీగా బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయని, కనీసం ఆరు నెలల పాటు తీవ్రస్థాయిలో యుద్ధం చేయగలమని ఐఆర్జీసీ తెలిపింది. రాబోయే రోజుల్లో మరింత అధునాతన క్షిపణులను ప్రయోగిస్తామని హెచ్చరించింది.
0 Comments