ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం శ్రీరామనవమికి రెండు రోజుల సెలవు ప్రకటించింది. 26వ తేదీని శ్రీరామనవమి సెలవు దినంగా ఇప్పటికే ప్రకటించగా, తాజాగా 27వ తేదీకి కూడా సెలవును పొడిగించింది. పండుగ సందర్భంగా ఆలయాలను సందర్శించే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మతపరమైన మనోభావాలను గౌరవిస్తూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు యోగి ఆదిత్యనాథ్ రెండ్రోజుల సెలవుదినాల నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తద్వారా రామనవమి ఉత్సవాల్లో పాల్గొనే ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పించడం జరుగుతుందని పేర్కొన్నాయి. శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో అధికారులు రాష్ట్రవ్యాప్తంగా విస్కృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. యూపీలోని ప్రధాన ఆలయాలను సందర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఏటా తరలివస్తుంటారు. అయోధ్యతో పాటు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఊరేగింపులు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన మార్గదర్శకాలను పోలీసులు, ప్రభుత్వాధికారులు ఇప్పటికే విడుదల చేశారు. అయోధ్య, వారణాసి, మధుర సహా ఇతర ప్రధాన నగరాల్లో ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొంది.
0 Comments