Ad Code

కోలుకుని ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చిన స్టాక్ మార్కెట్ !


గత మూడు రోజులుగా వరుస నష్టాల్లో ఉన్న మార్కెట్లు ఈరోజు కోలుకుని ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి. సెన్సెక్స్ 938.93 పాయింట్లు (1.26 శతం) పెరిగి 75,502.85 వద్ద ముగిసింది. నిఫ్టీ.. 257.70 పాయింట్లు (1.11 శాతం) లాభపడి 23,408.80 వద్ద స్థిరపడింది. మార్కెట్‌లో ఈరోజు 1,410 షేర్లు లాభపడగా.. 2,772 షేర్లు నష్టపోయాయి. 157 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్  2.9 శాతం పెరిగింది. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ కూడా 1 శాతం మేర లాభపడ్డాయి. అల్ట్రాటెక్ సిమెంట్ ఏకంగా 4.22 శాతం పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, టాటా స్టీల్, ఎస్‌బీఐ కూడా మంచి లాభాలను సాధించాయి. ఇక సన్ ఫార్మా, భారత్ ఎలక్ట్రానిక్స్, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టపోయాయి. మార్కెట్ పుంజుకోవడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది తక్కువ ధరల వద్ద కొనుగోళ్లు. గత కొన్ని రోజులుగా మార్కెట్లు పడిపోవడంతో మంచి కంపెనీల షేర్లు తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లు వాటిని కొనేందుకు ఆసక్తి చూపారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాల షేర్లకు మంచి డిమాండ్ కనిపించింది. మార్కెట్‌లో ఆందోళనను సూచించే ‘ఇండియా విక్స్’ 5 శాతం మేర తగ్గింది. ఇది మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి తగ్గుతుందని చెప్పడానికి ఒక సంకేతం. అయితే మార్కెట్‌లో ఇంకా కొంత ఒడుదొడుకులు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ సముద్ర మార్గంలో చమురు రవాణాకు ఆటంకం కలగకుండా దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడుతున్నాయన్న వార్త మార్కెట్‌కు బలాన్నిచ్చింది. మన దేశానికి చెందిన రెండు గ్యాస్ నౌకలు క్షేమంగా భారత్‌కు వస్తుండటం ఇంధన సరఫరాపై ఆందోళనలను తగ్గించింది. మార్కెట్ ఈరోజు పెరిగినప్పటికీ టెక్నికల్‌గా చూస్తే నిఫ్టీ 23,500 పైన స్థిరపడితేనే మరింత పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ మార్కెట్ మళ్ళీ తగ్గడం ప్రారంభిస్తే 22,800 స్థాయి వరకు వెళ్లే ప్రమాదం ఉందని కోటక్ సెక్యూరిటీస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే వారం నిఫ్టీ 22,000 నుంచి 24,000 మధ్య ట్రేడ్ కావచ్చని అంచనా.

Post a Comment

0 Comments

Close Menu