అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ప్రజాభవన్లో ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ప్రసంగిస్తూ మహిళలకు ఎప్పుడూ గుర్తింపు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని, దేశంలో ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. కీలకమైన శాఖలను మహిళా అధికారులు సమర్థంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు. వెయ్యి బస్సులకు మహిళలు యజమానులుగా ఉన్నారని ప్రస్తావించారు. తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్లో పెట్టి ప్రపంచానికి అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఇటీవల మావోయిస్టుల లొంగుబాటులోనూ మహిళా అధికారులే కీలకమని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని, నిర్వహణ బాధ్యతలూ అప్పగించామని వ్యాఖ్యానించారు. దేశంలో మహిళల శ్రమకు గుర్తింపు, తగిన ఫలితం లేదన్నారు. మహిళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. దేశంలో కుల, జెండర్ వివక్ష ఉందని తెలిపారు. అమెరికాలో కూడా వివక్ష ఉంది.. కానీ అక్కడ కష్టానికి గుర్తింపు ఉంటుందని అన్నారు. ఇక్కడ మాత్రం కష్టపడేవారికి గుర్తింపు ఉండదని చెప్పుకొచ్చారు. కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. మహిళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అన్ని సంస్థలపైనా ఉంటుందన్నారు. అదే ఐడియాలజీతో యుద్ధం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వెల్లడించారు. మహిళల ఆర్థిక శక్తిని పెంచాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పెంచే ప్రణాళికలను తయారు చేశామని వివరించారు. హైదరాబాద్ను పొల్యూషన్ ఫ్రీ నగరంగా మార్చాలని సూచించారు. చంద్రబాబు, వైఎస్సార్ హైదరాబాద్ను అభివృద్ధి చేశారని అన్నారు. రెడ్, ఆరెంజ్ కేటగిరి పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు పంపిస్తామని తెలిపారు. ప్రతిపక్షాల నేతలు మూసీ ప్రక్షాళన చేయాలని అంటున్నారని.. కానీ తమ ప్రభుత్వం అభివృద్ధి చేద్దామని చూస్తే మాత్రం ఎందుకు అడ్డుతగులుతున్నారని ప్రశ్నించారు. ఇటీవల ఓ అపార్ట్మెంట్ విషయంలో రాద్ధాంతం చేశారని సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. 2026 డిసెంబర్ నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ఆటోలనూ ఎలక్ట్రిక్గా మార్చుతామని అన్నారు. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని మాటిచ్చారు. గాంధీ విగ్రహం కట్టడానికి రూ.500కోట్లని ప్రతిపక్షాల నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. గాంధీ విగ్రహానికి రూ.70కోట్లే ఖర్చు అవుతోందని స్పష్టం చేశారు. గాంధీ విగ్రహం దగ్గర విజ్ఞాన కేంద్రానికి రూ.100కోట్లు ఖర్చు అవుతోందని తెలిపారు. మహిళలకు రక్షణ మాత్రమే కాదని.. అవకాశాలు కూడా ఇస్తామని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో అవాస్తవాల ప్రచారంపై ఫిర్యాదులు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. హైదరాబాద్లో కాలుష్యం, దోమలు ఎక్కువగా ఉన్నాయంటున్నారని చెప్పుకొచ్చారు. మూసీని ప్రక్షాళన చేస్తామంటే ప్రతిపక్షాల నేతలు అడ్డుపడుతున్నారని ఆగ్రహించారు. మూసీ ప్రక్షాళన వద్దంటున్నారా..?, తొలగింపులు వద్దంటున్నారా? అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. కాలుష్యంతో హైదరాబాద్ నాన్ లివింగ్ సిటీగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. నదుల బఫర్ జోన్లలో ఎలాంటి కట్టడాలకు అనుమతులు లేవని తేల్చిచెప్పారు. అలాంటి చోట నిర్మాణాలు చేపట్టినా తొలగించాల్సి వస్తుందన్నారు. బఫర్ జోన్ల పరిధిలో 50మీటర్ల లోపల ఉంటే ఇళ్లకు విలువ ఉండదని తెలిపారు. ఇలాంటి అంశాల్లో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. నష్ట పరిహారం ఇచ్చే బఫర్ జోన్లోని ఇళ్లను తొలగిస్తామని స్పష్టం చేశారు. నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపిస్తామని భరోసా కల్పించారు. మూసీ నిర్వాసితులకు ఏం కావాలో ప్రతిపక్షాల నేతలు చర్చిస్తే బాగుంటుందని అన్నారు. ఈనెల 13వ తేదీన మూసీ పునరుజ్జీవంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామని తెలిపారు. డీపీఆర్ కూడా ప్రెజెంట్ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
0 Comments