కర్ణాటకలోని విశ్వ విద్యాలయాల్లో కుల వివక్షను అరికట్టేందుకు ప్రభుత్వం 'రోహిత్ వేముల చట్టం' తీసుకువస్తుందని ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య అన్నారు. ఈ చట్టాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్ ఇన్ స్టిట్యూషన్స్ లో అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఈ మేరకు సీఎం సిద్ధ రామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కర్ణాటక ప్రభుత్వం నిర్ణయాన్ని రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ కన్వీనర్, గుజరాత్ లోని వడ్గామ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. "ఇది @INCKarnataka, ముఖ్యమంత్రి @siddaramaiah నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక, సాహసోపేతమైన అడుగు! అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్ విద్యాసంస్థల్లో 'రోహిత్ వేముల చట్టాన్ని' (ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ / ఎస్టీలపై కుల వివక్ష నిరోధక చట్టం) అమలు చేస్తున్నట్లు ప్రకటించడం, క్యాంపస్ లలో కుల ఆధారిత అణచివేత, వివక్ష, వ్యవస్థాగత హత్యలకు ముగింపు పలికే ఒక ధీటైన చర్య. కుల నిర్మూలన జరగాలనే రోహిత్ కల, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం ఈ చట్టం ద్వారా సజీవంగా ఉంటుంది. దళిత, ఆదివాసీ, అణగారిన విద్యార్థులకు న్యాయం అందించడంలో కర్ణాటక.. దేశానికే మార్గదర్శిగా నిలుస్తోంది. రోహిత్ జ్ఞాపకార్థం గౌరవిస్తూ, విద్యారంగంలో కుల వివక్షపై కఠిన చర్యలు తీసుకుంటున్న పురోగామి కాంగ్రెస్ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది దేశవ్యాప్తంగా ఇలాంటి చట్టాలు రావడానికి స్ఫూర్తినిస్తుంది! జై భీమ్!" అని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఇక 2026-27 రాష్ట్ర బడ్జెట్ లో రోహిత్ వేముల చట్టాన్ని ప్రవేశపెడుతున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులపై జరిగే కుల వివక్ష, దాడులను నిరోధించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. ఇక ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి చట్టాన్ని అమలు చేస్తున్న దేశంలోనే మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలవనుంది. ఈ చట్టం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు వర్తిస్తుంది. రోహిత్ వేముల బిల్లుపై గతంలో కేబినెట్ సమావేశాల్లో చర్చలు జరిగాయి. కానీ ఈ బిల్లును సమావేశంలో ప్రవేశపెట్టలేదు. అయితే 2025లో ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు రాహుల్ గాంధీ లేఖ రాశారు. విద్యాసంస్థల్లో కుల సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ఈ చట్టాన్ని త్వరగా తీసుకురావాలని కోరారు. ఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
0 Comments