కువైట్ విమానాశ్రయాన్ని ఇరాన్ బుధవారం మరోసారి టార్గెట్ చేసింది. ఈసారి కువైట్ ఎయిర్ పోర్ట్కు అతి సమీపంలో ఇరాన్ డ్రోన్ బాంబ్ పడి పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. గాల్లోకి పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ ప్రమాదం మాత్రం కువైట్కు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కువైట్ ఆర్మీ కూడా ఈ డ్రోన్ అటాక్ జరిగిందని నిర్ధారించింది. యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాల్లో మరీ ముఖ్యంగా కువైట్లో పరిస్థితులు అక్కడ ఉపాధి కోసం వెళ్లిన భారతీయులను కూడా కలవరపెడుతున్నాయి. కువైట్ నుంచి తిరిగి సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు విమానాశ్రయానికి వెళుతున్నారు. ఇరాన్ ఏకంగా ఎయిర్ పోర్ట్లనే టార్గెట్ చేయడంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణికులు కువైట్ విమానాశ్రయానికి వెళుతున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణలో గల్ఫ్ దేశాల్లోని ఇంధన కేంద్రాలను టార్గెట్ చేయడం సాధారణమైన విషయంగా మారింది. కానీ.. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ అనుసరిస్తున్న ఈ వ్యూహం వల్ల గల్ఫ్ దేశాలతో పాటు.. ఆ దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్న దేశాలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఖతార్తో పాటు గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలపై ఇరాన్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటి ఆయిల్ రిఫైనరీలపై ఇరాన్ చేసిన దాడులతో ఖతార్కు భారీ నష్టం జరిగింది. ఈ దాడుల కారణంగా ఎల్ఎన్జీ ఎగుమతుల్లో 17 శాతం వరకు ఉత్పత్తి చేసే కేంద్రాలు దెబ్బతిన్నాయని ఖతార్ ఎనర్జీ తెలిపింది. వాటి మరమ్మతులకు మూడు నుంచి ఐదు సంవత్సరాలు పడుతుందని తెలిపింది.
0 Comments