తెలంగాణలోని ఖమ్మం నగరంలో వెలుగుమట్ల ప్రాంతానికి చెందిన భూదాన్ యజ్ఞ బోర్డు భూముల నిర్వాసితులతో కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈరోజు ర్యాలీ నిర్వహించారు.ఈ క్రమంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవితతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్, పలువురు ఆందోళనకారులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ర్యాలీ అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగింది. అక్కడికి చేరుకున్న అనంతరం కవిత అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ ర్యాలీ అనంతరం నిర్వాసితులు ఖమ్మం జడ్పీ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలో భాగంగా కొంతమంది నిర్వాసితులు రాస్తారోకో నిర్వహించి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో జడ్పీ సెంటర్ పరిసరాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కవితను నేలకొండపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆందోళనల నేపథ్యంలో ఖమ్మం జడ్పీ సెంటర్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.
0 Comments