తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం రంగారెడ్డిగూడ ఊరి చివరన నిర్మానుష్య ప్రాంతంలో తల్లి మృతదేహం పక్కన రెండున్నరేళ్ల చిన్నారి రాత్రంతా ఏడుస్తూ వుంది. ఆదివారం తెల్లవారుజామున అటుగా వెళ్తున్న స్థానికులు చిన్నారి ఏడుపు విని అక్కడికి వెళ్లి చూడగా, తలపై బండరాయితో మోది హత్యకు గురైన మహిళ మృతదేహం కనిపించింది. రంగారెడ్డిగూడకు చెందిన శోభ (31) అనే మహిళకి పదేళ్ల కిందటే మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండకు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా మూడేన్నరేళ్ల కిందట విడిపోయిన ఆమె, నర్సింహులు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వీరికి మమత అనే రెండున్నరేళ్ల కుమార్తె ఉంది. అయితే నర్సింహులు మద్యానికి బానిస కావడంతో శోభ పుట్టింటికి వెళ్లి తన తల్లి వద్ద ఉంటోంది. శనివారం నాడు కొడుకుకు సైకిల్ కొనిస్తానని నర్సింహులు చెప్పడంతో ఆమె షాద్ నగర్ కు వెళ్లింది. సాయంత్రం వరకు అతడు రాకపోవడంతో ఆమె కోయిలకొండ ఇంటికి వెళ్లింది. కుమారుడ్ని ఇంటి వద్దే ఉంచిన శోభ మళ్లీ కుమార్తెతో కలిసి బయలుదేరినట్లు స్థానికులు చెబుతున్నారు. శోభ తల్లి కరుణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాద్ నగర్ సీఐ సీతారాం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు నర్సింహులుపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలంలో చిన్నారి పడిన వేదన చూసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి నుండి ఆదివారం తెల్లవారుజాము మధ్యలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, శోభను ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి మహబూబ్ నగర్ లో ని వీరన్నపేటలో హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ఒక బస్తాలో కుక్కి, చిన్నారితో పాటు బైక్ ముందు భాగంలో పెట్టుకుని తరలించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు తన రెండున్నరేళ్ల చిన్నారితో పాటు బైక్ పై ఓ బస్తాలో ఉన్న శోభ మృతదేహంతో సుమారు 50 నుండి 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మార్గమధ్యలోని సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు పోలీసులు గుర్తించారు. తన ప్లాన్ ప్రకారం చివరకు రంగారెడ్డిగూడ శివారులోని నిర్మూనుష్య ప్రాంతానికి చేరుకున్నాక, అక్కడ శోభ మృతదేహాన్ని పడేసి, తన రెండున్నరేళ్ల కూతుర్ని కూడా అక్కడే వదిలేసి పరారయ్యాడు.
0 Comments