Ad Code

మొబైల్ డేటాపై కేంద్రం పన్ను ?


ప్రతి జీబీ మొబైల్ డేటాపై ప్రత్యేక పన్ను విధించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలని కేంద్ర టెలికం విభాగాన్ని  కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనుక అమల్లోకి వస్తే, ఇప్పటికే పెరిగిన రీఛార్జ్ ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై అదనపు భారం పడటం ఖాయంగా కనిపిస్తోంది. దేశంలో పెరుగుతున్న డిజిటల్ వినియోగాన్ని క్రమబద్ధీకరించడంతో పాటు, టెలికాం రంగం ద్వారా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి జీబీ మొబైల్ డేటా వాడకంపై పన్ను విధించే వినూత్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జనవరి 7న జరిగిన ఉన్నత స్థాయి టెలికాం సమీక్షా సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. దీనిపై సమగ్ర కార్యాచరణను రూపొందించి, సెప్టెంబర్ 30 నాటికి నివేదిక సమర్పించాలని టెలికమ్యూనికేషన్ల శాఖను కేంద్రం ఆదేశించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మొబైల్ డేటా వినియోగం సుమారు 229 బిలియన్ జీబీలుగా నమోదైంది. ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా ప్రతి జీబీ డేటాపై కేవలం రూ. 1 పన్ను విధిస్తే, వార్షికంగా ప్రభుత్వానికి సుమారు రూ. 22,900 కోట్ల భారీ ఆదాయం సమకూరనుంది. ఇప్పటికే మొబైల్ రీఛార్జ్‌లపై వినియోగదారులు 18 శాతం జీఎస్టీ చెల్లిస్తుండగా, ఈ కొత్త పన్ను అమల్లోకి వస్తే ఇంటర్నెట్ వాడకం మరింత ఖరీదు కానుంది. అయితే, ఆదాయం సంపాదించడమే కాకుండా, పిల్లలలో పెరుగుతున్న డిజిటల్ వ్యసనాన్ని తగ్గించడం కూడా ఈ పన్ను వెనుక ఉన్న మరో ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిపాదనపై టెలికాం నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాయ్ మాజీ ప్రధాన సలహాదారు సత్య ఎన్. గుప్తా అభిప్రాయం ప్రకారం, డేటా వినియోగంపై పన్ను విధించడం వల్ల దేశంలో సాంకేతిక ఆవిష్కరణలు కుంటుపడతాయి. ప్రపంచంలోనే అత్యంత చౌకగా డేటాను అందిస్తున్న భారత్, ఈ నిర్ణయంతో తన నాయకత్వ స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. డేటా వినియోగాన్ని పర్యవేక్షించి పన్ను వసూలు చేయడం సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అని, ఇది వినియోగదారులకు అంతరాయం కలిగించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో కేవలం పన్నులే కాకుండా పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగుల సంఖ్యను హేతుబద్ధీకరించాలని నిర్ణయించారు. ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్ తమ ఆదాయంలో కేవలం 1.6 నుండి 1.9 శాతం మాత్రమే సిబ్బంది ఖర్చులకు కేటాయిస్తుంటే, బీఎస్ఎన్ఎల్ ఏకంగా 37 శాతం ఖర్చు చేస్తోంది. అందుకే ఇతర శాఖల నుండి డిప్యూటేషన్ పై వచ్చిన సిబ్బందిని వెనక్కి పంపాలని సూచించారు. టెలికాం పరికరాల దిగుమతులను తగ్గించి, ఏటా కనీసం 10 ప్రధాన పరికరాలను 'మేడ్-ఇన్-ఇండియా' కింద దేశీయంగా తయారు చేసేలా జూన్ నాటికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సైబర్ భద్రతను బలోపేతం చేయడంలో భాగంగా, ఇకపై సిమ్ కార్డులను కేవలం ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా మాత్రమే జారీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సమావేశంలో కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసానితో పాటు నీతి ఆయోగ్ సీఈఓ తదితర అగ్రనేతలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu