సౌదీ అరేబియాలోని రియాద్ పట్టణంపై ఇరాన్ జరిపిన మిస్సైల్ దాడిలో భారతీయుడు మరణించాడు. ఈ విషయాన్ని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ధృవీకరించింది. ఈ నెల 18న రియాద్ పట్టణంపై ఇరాన్ మిస్సైల్ దాడి చేసింది. ఈ దాడిలో ఒక భారతీయుడు మరణించాడని తమకు గురువారం రాత్రి సమాచారం అందినట్లు ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. ఇటీవల ఇరాన్ దాడుల్లో గల్ఫ్ దేశాల్లో మరణించిన భారతీయుల సంఖ్య 6కు చేరింది. తాజాగా మరణించిన భారతీయుడికి సంబంధించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు రాయబార కార్యాలయం తెలిపింది. ఈ అంశంపై అక్కడి భారత రాయబారి మహాజన్ స్పందించారు. మృతుడి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నామని, వారికి తగినంత సాయం అందిస్తామని, మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. అలాగే ఇటీవల ఎమ్టీ సేఫ్ సీ విష్ణు ఆయిల్ ట్యాంకర్ నుంచి 15 మంది భారత సిబ్బందిని రక్షించామని, వారు శుక్రవారం ఇండియా చేరుకుంటారని కూడా ఆయన తెలిపారు. మరోవైపు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కువైట్లోని కీలక చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడి చేసింది. అక్కడి మినా అల్ అహ్మదీ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ పేలుడుకు భారీగా మంటలు వ్యాపించాయి. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం లేదని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. ఇటీవల గల్ఫ్ దేశాల్లోని చమురు కేంద్రాల్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేస్తున్న దాడులతో భారీ నష్టమే జరిగింది. ముఖ్యంగా ఆయా దేశాల్లో చమురు ఉత్పత్తి తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడానికి ఆరు నెలల సమయం పడుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ ఫాతి బిరోల్ అన్నారు.
0 Comments