తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచింది, కానీ కాంగ్రెస్ మాత్రం 420 వరల్డ్ కప్ గెలిచింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మూసీలో ముంపుకు గురవుతున్న ఇళ్ల విలువపై వస్తున్న చర్చలను ప్రస్తావిస్తూ, ప్రజల ఆస్తులకు జీరో విలువ కాదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి చేసిన తొలి సంతకానికే జీరో విలువ ఏర్పడిందని విమర్శించారు. ఆయన సంతకం చేసిన తొలి ఫైల్కూ ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ కార్డులు, ఎన్నికల డిక్లరేషన్లు ప్రజల్లో నమ్మకం కోల్పోయాయని కేటీఆర్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో, వాటి విలువ పూర్తిగా పడిపోయిందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో విశ్వసనీయత లేకుండా పోయిందని, అందుకే "జీరో వాల్యూ" పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు మరింత ముదురుతున్నాయి.
0 Comments