భారత్, న్యూజిలాండ్ మధ్య నరేంద్ర మోడీ స్టేడియంలో మార్చి 8న జరిగిన ఫైనల్లో అర్ష్దీప్ సింగ్ ఐసీసీ కోడ్ను ఉల్లంఘించినందుకు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. టీమిండియా నిర్దేశించిన 256 పరుగుల ఛేదనలో 77 పరుగులకే సగం వికెట్లు పడిన వేళ కెప్టెన్ మిచెల్ శాంట్నర్(43)తో కలిసి డారిల్ మిచెల్ (17) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే 11 వ ఓవర్లో బంతి అందుకున్న అర్ష్దీప్ను ఉతికేస్తూ మిచెల్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. దాంతో అసహననానికి గురై మూడో బంతిని కివీస్ బ్యాటర్ స్ట్రెయిట్గా ఆడడంతో బంతిని అందుకున్న అర్ష్దీప్ వేగంగా అతడివైపు విసిరాడు. బంతి నేరుగా వెళ్లి మిచెల్కు గట్టగా తాకింది. భారత పేసర్ తీరుతో చిర్రెత్తుకొచ్చిన మిచెల్.. ‘ఏయ్ మ్యాన్ నీకేమైనా పిచ్చా.. ఏమైంది.. ఎందుకిలా విసిరావు’ అని కోపంగా అరుస్తూ అర్ష్దీప్ వైపు వచ్చాడు. అంతలోనే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కలుగచేసుకొని కివీస్ స్టార్కు నచ్చచెప్పాడు. అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్వర్త్ సైతం భారత బౌలర్ ప్రవర్తనను తప్పుపట్టి మందలించాడు. ఆ ఓవర్ చివరి బంతికి మిచెల్, అర్ష్దీప్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో అంతా సద్దుమణిగింది అనిపించింది. భారత్ గెలిచిన తర్వాత అర్ష్దీప్ తాను మిచెల్కు సారీ చెప్పానని వెల్లడించాడు. కానీ, మిచెల్ తేలికగా తీసుకున్న ఈ విషయాన్ని ఆన్ఫీల్డ్ అంపైర్లు, రిఫరీలు మాత్రం వదల్లేదు. మైదానంలో అనుచిత ప్రవర్తనకు పాల్పడిన అర్ష్దీప్ ఐసీసీ నియమ నిబంధనలను ఉల్లంఘించడాన్ని నేరంగా పరిగణించాడు. ఆర్టికల్ 2.9 ప్రకారం క్రికెట్ వస్తువులను అగౌరపరచడం, బంతి లేదా బ్యాటుతో ఆటగాళ్లను గాయపరచాలని చూడడం వంటివి తీవ్రమైన నేరం కిందకు వస్తాయి. ఫైనల్లో అర్ష్దీప్ సైతం ఇలాంటి నేరానికే పాల్పడ్డాడు. మ్యాచ్ అనంతరం భారత స్పీడ్స్టర్కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు. మరో 24 నెలల్లో అతడు ఇలానే పొరపాటు చేస్తే మ్యాచ్ నిషేధం విధించే అవకాశముంది.
0 Comments