దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, చమురు ధరల పెరుగుదల, విదేశీ సంస్థాగత మదుపర్ల భారీ అమ్మకాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. దీంతో సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాలను నమోదు చేశాయి. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ ఒక దశలో 1470 పాయింట్లు పడిపోయింది. చివరకు 1470.50 పాయింట్ల నష్టంతో 74,563.92 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కూడా 488 పాయింట్లు పడిపోయి 23,151 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.10 లక్షల కోట్లు క్షీణించి 429 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ సూచీలో హిందుస్థాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్టెల్ తప్ప మిగిలిన అన్ని స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, ఎస్బీఐ, బీఈఎల్, మారుతీ సుజుకీ షేర్లు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్కు 100.61 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. చమురు ధరలు పెరగడంతో రూపాయి విలువపై కూడా ఒత్తిడి పెరిగింది. డాలర్తో రూపాయి మారకం విలువ 92.45 వద్ద కొనసాగుతోంది.
0 Comments