తెలంగాణ లోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిధిలోని కాట్నపల్లి శివారులో అతివేగంగా దూసుకొచ్చిన కారు గొర్రెల మందపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో పది గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడగా, గొర్రెల కాపరి తీవ్రంగా గాయపడ్డారు. పెద్దపల్లి నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు కాట్నపల్లి వద్దకు రాగానే అదుపుతప్పింది. రోడ్డుపై మేత కోసం వెళ్తున్న గొర్రెల మందపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ధాటికి 10 గొర్రెలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. గొర్రెలను ఢీకొట్టిన అనంతరం కారు రోడ్డు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో శాస్త్రి నగర్కు చెందిన గొర్రెల కాపరి రాజు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, బాధితుడిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మరో ఆరు గొర్రెల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కారు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూగజీవాల మృతితో గొర్రెల కాపరి కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
0 Comments