తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్లో పలు కీలక అంశాలను వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధి, నియామకాలు, రాజకీయ పరిణామాలపై ఆమె తనదైన శైలిలో స్పందించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి వద్ద సుమారు 100 కిలోల బంగారం ఉందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం బ్యాంకుల్లో ఉన్న ఈ బంగారాన్ని వెలికితీసి, స్వామి వారికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆభరణాలను తయారు చేయిస్తామని ప్రకటించారు. ఈ నెల 27వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో పర్యటించనున్నారు. అక్కడ సుమారు రూ. 350 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు త్వరలోనే ఈవోల నియామకం చేపడతామని, అలాగే దేవాదాయ శాఖలో ప్రమోషన్ల ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి కానుందని చెప్పారు. యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు నియామకానికి సంబంధించిన ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద ఉందని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ, తమకు వ్యక్తిగతంగా ఎవరితోనూ విభేదాలు లేవని మంత్రి స్పష్టం చేశారు. అయితే, కొంతమంది నేతల తీరుపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒక్క ఎర్రబెల్లి దయాకర్ రావు మినహా మిగిలిన నాయకులందరూ మాతో మాట్లాడుతుంటానని అని ఆమె పేర్కొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి తాను పోటీ చేసినప్పటి నుండి బసవరాజ్ సారయ్య తనతో మాట్లాడటం లేదని మంత్రి వెల్లడించారు.
0 Comments